Office: 08659299992mylavaramgdc@gmail.com
College Information

Brief History

Official information and resources from Dr. Lakireddy Hanimireddy Government Degree College, Mylavaram.

Brief History

DONORS MESSAGE

DONORS MESSAGE

“విద్యావంతుడు అన్నిచోట్లా పూజింపబడతాడు”

        ప్రియమైన విద్యార్థి మిత్రులారా!

                          మానవ జీవితాలను సమూలంగా మార్చగలిగే అద్భుతశక్తి పేరే.....”చదువు”. ఒక వ్యక్తిని సామాజిక,  ఆర్థిక,  సాంస్కృతిక వెనుకబాటుతనం నుండి విముక్తుడిని చేసి,  ఒక మహా శక్తిగా నిలబెట్టి చదువు.

              మానవుని మిగిలిన జంతుజాలం నుండి వేరు చేసి, వివేచన గల  మేధావిగా, సంఘజీవిగా, సంస్కర్తగా, విజ్ఞానవేత్తగా,  పండితునిగా,  వివిధ వృత్తులు నిర్వహించగల సమర్థునిగా, విలువలు పాటించే నైతిక జీవిగా మలిచేది చదువు మాత్రమే. చదువు సామాన్యుల్ని సైతం మహోన్నతుడిగా మారుస్తుంది. విద్యావంతుడు అన్ని చోట్లా, అన్ని సమాజాలలోను అన్ని కాలాలలోనూ, అన్ని దేశాలలోనూ, అందరిచే గౌరవింపబడతాడు.

                 అటువంటి ఉన్నత విద్యని మన ప్రాంత విద్యార్థినీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఎటువంటి లాభాపేక్ష లేని విద్యాలయంగా నడపాలనే ఆశతో, ఆశయంతో  ఈ కళాశాలని నిర్మించి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది.

          ఈ కళాశాల విద్యార్థులు విశ్వవ్యాప్తంగా వివిధ రంగాలలో చోటుచేసుకున్న పరిణామాలకు అనుగుణంగా, ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకుని , నైతిక విలువలు కలిగిన సమున్నత వ్యక్తులుగా రూపొందితే  నా కల  నెరవేరుతుంది.

        ప్రతి విద్యార్థి తదేకదీక్షతో చదువుకొని తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకువెళ్లి, తన చుట్టూ ఉన్న సమాజానికి తనకు వీలైనంత సేవా చేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించడానికి ఈ కళాశాల అధ్యాపకులు సిబ్బంది తోడ్పడతారు.

        రండి మీ జీవితాలను అందంగా మలచుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోండి! మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలని మనసారా కోరుకుంటున్నాను.

                             ఇట్లు
                        భవదీయుడు
                 డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి

About Donor

డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారి జీవిత సంగ్రహం

                            డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారు లక్ష్మీ రెడ్డి,  నారాయణమ్మ గార్ల మూడవ కుమారుడిగా 1942లో వెల్వడం గ్రామంలో జన్మించారు. 1947 నుంచి 1953 వరకు వెల్వడంలో శ్రీ యరమల పర్వత రెడ్డి, శ్రీ పాటిబండ్ల  రామచంద్ర రావు, శ్రీ తాడెపు కోటయ్య, శ్రీ వెల్వడపు రామకృష్ణా రావు, శ్రీ చెరుకుపల్లి  కనకయ్య గార్ల వద్ద విద్యనభ్యసించారు. 1953లో మైలవరం హై స్కూల్లో చేరి 1959 ఎస్.ఎస్.సి పూర్తి చేశారు. తన అన్నగారైన శ్రీ లకిరెడ్డి బాలిరెడ్డి గారి ప్రోత్సాహంతో సహకారంతో హైదరాబాదులోని న్యూ సైన్స్ కాలేజీలో పి .యు. సి చదువుకున్నారు .అక్కడ తన పినతండ్రి గారైనా రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. చిన్నమ్మ జాలమ్మ గారు కూడా హనిమిరెడ్డి గారిని సొంత బిడ్డల్లా చూసుకున్నారు.

                            1960లో పి .యు. సి పూర్తిచేసి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ లో ఎంబీబీఎస్ లో చేరి 1966లో మెడిసిన్ పూర్తిచేశారు .1967లో హౌస్ సర్జన్ పూర్తిచేసి 1968 మైలవరంలో మెడికల్ ప్రాక్టీసు మొదలు పెట్టారు. 1978 వరకు అక్కడే తన వైద్య వృత్తిని కొనసాగించారు .వీరికి 1971లో విక్రమ్, 1977లో సిద్ధార్థ ఇద్దరు కుమారులు జన్మించారు.

                          అప్పటికే ముగ్గురు సోదరులు అమెరికాలో స్థిరపడడంతో 1978 జనవరిలో భార్య విజయలక్ష్మి ఇద్దరు కుమారులతో కలిసి అమెరికా వెళ్లారు. తండ్రి గారి ప్రోద్భలం   పెద్దన్న బాలిరెడ్డి గారి సహాయ సహకారాలు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచాయి. అమెరికాలోమళ్లీ ఆరు సంవత్సరాల పాటు కష్టపడి మెడిసిన్ పరీక్షలన్నీ పూర్తిచేసుకుని కాలిఫోర్నియా రాష్ట్రంలోని మేర్సిడ్ అనే పట్టణంలో 1984లో కార్డియాలజిస్ట్ ప్రాక్టీసు ప్రారంభించారు.

                         అమెరికా ప్రభుత్వం, అమెరికా ప్రజల మంచితనం, పెద్ద మనసు మూలంగానే అమెరికాలో ఎంతో మంచి పేరు, డబ్బు సంపాదించగలిగానని అని  మనసారా నమ్ముతారు.

                       1942లో బ్రిటిష్ ఇండియా లోని మారుమూల గ్రామం రైతు కుటుంబంలో పుట్టి, అమెరికాలో కార్డియాలజిస్ట్ గా ఇంత పేరు తెచ్చుకోవడానికి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి చేరుకోవడానికి కారణమైన “చదువు” అని మూడు అక్షరాల కారణమని హృదయపూర్వకంగా నమ్ముతారు. డాక్టర్ హనిమిరెడ్డి గారు ఆ రోజుల్లో వెల్వడం గ్రామంలో ఆర్థికంగా ఉన్న కుటుంబంలో పుట్టారు. కాబట్టి ఆయన చదువుకోడానికి ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. అయితే అవకాశాలు లేక పై చదువులు చదుకోలేకపోతున్న ఎంతో మందికి సరియైన అవకాశాలు అందుబాటులోకి తేవడం ద్వారా  తన కంటే పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలనేది డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారి ఆశయం. అందుకే 70 సంవత్సరాల వయసులో కూడా డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న ప్రతిరోజు కష్టపడి పనిచేసే సంపాదించిన డబ్బులు కొంత భాగాన్ని విద్యార్థుల సహాయం కోసం దానం చేశారు .తాను ఉంటున్న మేర్సిడ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి, మేర్సిడ్ కాలేజీకి దాదాపు 12 కోట్ల రూపాయలు , ఇండియా లో అలంటి ప్రణాళికలకె దాదాపు 15 కోట్ల రూపాయలు దానం చేశారు .

                      ఈ సుందరమైన డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ కళాశాలకి అవసరమైన ఆరు ఎకరాల స్థలానికి, నిర్మాణానికి అవసరమైన ధనమంతా డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారు ఒక్కరే అమెరికాలో కష్టపడి సంపాదించిన విషయం గమనార్హం. దీని మొత్తం ఖర్చు దాదాపు 9 కోట్ల రూపాయలు.

                    ఈ ప్రాంతంలోని విద్యావకాశాలు పెంపుదల కోసం వెల్వడంలో తాము చదువుకున్న ప్రాథమిక పాఠశాల కోసం శాశ్వత భవనం, మైలవరంలోని ప్రాథమిక పాఠశాల కోసం శాశ్వత భవనం కూడా నిర్మింపజేశారు. అలానే మైలవరం లో హైస్కూల్ కోసం కూడా భవనాన్ని డాII హనిమిరెడ్డి గారు నిర్మింపచేసారు.

                  డాక్టర్ హనిమిరెడ్డి రెడ్డి గారి పెద్ద కొడుకు విక్రమ్ మేర్సిడ్ లోనే కార్డియాలజిస్ట్ గా తన తండ్రితో కలిసి వైద్య సేవలు అందిస్తున్నారు. విక్రమ్ భార్య రఘుప్రియ ముగ్గురు పిల్లలతో కలిసి మేర్సిడ్లో వుంటున్నారు.చిన్నబ్బాయి సిద్ధార్థ భార్య నవనీత్, ఇద్దరు కుమారులు ఒక కూతురుతో సాన్ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు.  సిద్ధార్థ లాయర్ చదువు చదివి  మిగతా కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారంలో స్థిరపడ్డారు. హనిమిరెడ్డి గారు చేస్తున్న దానధర్మాల విషయంలో ఇతర సేవా కార్యక్రమాల్లోనూ ఆయన శ్రీమతి విజయలక్ష్మి గారు కుమారులు, కోడళ్ళు అన్ని విధాలా సహకరిస్తారు.